ధోనీ తర్వాత జడేజాకే పగ్గాలు.. అతడే సరైనోడు!

  • సీఎస్కే జట్టుకు నాయకత్వంపై చర్చ
  • రాబిన్ ఊతప్ప, పార్థివ్ పటేల్ సమర్థన
  • జడేజా సత్తా అందరికీ తెలుసన్న ఊతప్ప
  • అన్ని లక్షణాలున్నాయన్న పార్థివ్
ఐపీఎల్ నుంచీ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడం దాదాపు ఖరారైపోయింది. చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని అతడు చెప్పడం.. ఆ మాటలకు మరింత బలాన్ని చేకూర్చింది. మరి, ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను నడిపించే నాయకుడెవరు? అంటే.. రవీంద్ర జడేజా అనే సమాధానం వస్తోంది. సీఎస్కే ప్లేయర్ రాబిన్ ఊతప్ప ఈ విషయాన్ని చెబుతున్నాడు. ధోనీని కాకుండా రవీంద్ర జడేజాను మొదటి ప్రాధాన్య ఆటగాడిగా సీఎస్కే ప్రకటించడమూ అతడి మాటలకు మరింత బలాన్నిస్తున్నాయి. అంతేకాదు.. అందులో ధోనీ (రూ.12 కోట్లు) కన్నా ఎక్కువ ధరకు సీఎస్కే జడేజాను (రూ.16 కోట్లు) రిటెయిన్ చేసుకోవడం విశేషం.  

రిటైర్మెంట్ తర్వాత జట్టు పగ్గాలను జడేజాకే ధోనీ అప్పగిస్తాడని అనుకుంటున్నానంటూ ఊతప్ప చెప్పాడు. జడేజాకు లైన్ క్లియర్ చేసేందుకే ధోనీ తనంతట తానే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. జడేజా సత్తా ఏంటో జట్టులో అందరికీ తెలుసని చెప్పుకొచ్చాడు. ఊతప్ప వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కూడా సమర్థించాడు. సీఎస్కే కెప్టెన్ అయ్యే అన్ని లక్షణాలు జడేజాలో ఉన్నాయని చెప్పాడు. అతడో గొప్ప ఆటగాడని, వన్డేల్లో బాగా రాణిస్తున్నాడని గుర్తు చేశాడు. ధోనీ తర్వాత చెన్నైకి జడేజానే సరైనోడని స్పష్టం చేశాడు.

Cricket
IPL
MS Dhoni
Ravindra Jadeja
Chennai Super Kings

More Telugu News